తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని బీడుభూమలన్నీ సస్యశ్యామలమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ … ఆపనులను స్వయంగా పరిశీలించారు. ఈనేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ…భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతుల్లో ఎలాంటి అవాంతరాలు లేనందున కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారానే మంచి నీటి పథకమైన మిషన్ భగీరథ పనులు చేపడుతున్నందున పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు కేటాయించడంతో పాటు మరో రూ. 20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూరుస్తున్నామని సీఎం తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అతి తక్కువ సమయంలో అనుమతులను సాధించడానికి కృషి చేసిన అధికారులను సీఎం అభినందించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని అద్భుతంగా మెరుగుపరిచామన్నారు సీఎం కేసీఆర్. జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఇకపై ప్రతి రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు అందిస్తామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని గుర్తు చేశారు.మిషన్ భగీరథ పథకం గొప్పగా నడుస్తోందన్నారు . మరో నెలన్నరలో 98 శాతం గ్రామాలకు నీళ్లు అందుతాయన్నారు.
కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా మిషన్ భగీరథకు అవసరమైన నీరు అందించాలన్నారు. మిషన్ భగీరథకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మిషన్ భగీరథ లాంటి పథకం అమలు చేస్తున్నమంటున్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో మన సహకారాన్ని కోరుతున్నారని చెప్పారు. మనం కూడా అవసరమైతే ఆ రాష్ట్రాలకు మన అధికారులను పంపుదామన్నారు. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శంకర్ రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ రివ్యూలో పాల్గొన్నారు.