ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్ కానుంది. రాష్ట్రస్థాయిలోనూ టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినందున ఆమెకు ముఖ్యనేతలతో సంబంధాలున్నాయి. మరికొంతమంది నాయకులు ఉమ బాటలో నడవటానికి మార్గం ఏర్పడినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమామాధవరెడ్డిలాంటి సీనియర్ నేతలు కూడా టీడీపీని వీడుతుండటంతో ముఖ్యనాయకులు కూడా ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఉమామాధవరెడ్డి చేరికతో భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే భువనగిరి ఖిల్లాపై టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతున్నది. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక్కరోజు ముందుగానే భారీ జాతర మాదిరిగా హైదరాబాద్కు తరలివెళ్లి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకుంటామని ఉమామాధవరెడ్డి అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉమ్మడిరాష్ట్రంలో ఉమామాధవరెడ్డి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రెండు ధపాలు మంత్రిగా పనిచేశారు. ఆమె భర్త, మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని నక్సలైట్లు హత్యచేసిన తర్వాత మొదటిసారిగా భూగర్భ జలవనరులశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి నుంచి ఘనవిజయం సాధించిన తర్వాత మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. మాధవరెడ్డి హత్య అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలను మోశారు. అనేక కీలక సమయాలలో పార్టీ అధినేత వెంట ఉండి పనిచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె భువనగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయారు. తన కుమారుడు సందీప్రెడ్డిని కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా కమిటి తొలి అధ్యక్షుడిగా నియామకం చేసే విషయంలో తన ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయగలిగారు. అయితే, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలయ్యారు. దీంతో నెలరోజులుగా ఆమె టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. ఆమె పలు దఫాలుగా భువనగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు. టీఆర్ఎస్లో చేరటం వల్ల మేలు జరుగుతుందని, టీడీపీకి కాలం చెల్లిందన్న అభిప్రాయానికి రావటంతో ఆమె మంగళవారం సీఎం కేసీఆర్ను కలిసి తనను పార్టీలో చేర్చుకోవాల్సిందిగా కోరారు.