తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో పయనిస్తూ సంక్షేమంలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తోందని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పరిశీలించిన 70 మంది ఎన్నారై సభ్యుల బృందంతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు… ప్రపంచ తెలుగు మహాసభ లలో 42 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నారైలతో సమావేశమై రాష్ట్రంలో అభివృద్ధిని వివరించి బాగస్వామ్యులు కావాలని ఆహ్వానించిన మేరకు ఈ రోజు సిద్ధిపేట జిల్లాలో 70 మంది ఎన్నారై బృందం అభివృద్ధి పరిశీలించేందుకు వచ్చామని తెలిపారు.
వర్షాలు లేక ప్రాజెక్టుల నిర్మాణం చేయక పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి గర్వ పడుతున్నామన్నారు. మహిళలు మంచి నీటి కోసం ఇబ్బంది పడకుండా ఇంటింటికి రక్షిత త్రాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక బృహత్తర,గొప్ప పథకమని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మోడల్ అని కితాబిచ్చారు. 2018 నాటికి రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్లు ఇస్తానని లేకుంటే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగనని దైర్యంగా చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు.
ఒక సంవత్సరంలో గజ్వెల్ సెగ్మెంట్ నుండి మంచి నీరు అందించడం హర్షణీయమని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. జనవరి నుండి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇంకా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సూచనలు,సహకారం అందించి అభివృద్ధిలో భాగస్వామ్యులం అవుతామని హామీ ఇచ్చారు. రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించనున్నామని తెలిపారు.