తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రపంచ దేశాలకు చెందని వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో అంతర్జాతీయ సంస్థ నుంచి మంత్రి కే.తారకరామారావుకు ఆహ్వానం లభించింది. జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ ఆసోసియేషన్ 98వ సమావేశానికి హాజరుకావాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. జర్మనీలోని హంబర్గ్ లో మార్చ్ 2 వ తేదిన జరగనున్న ఈ సమావేశానికి వచ్చి తెలంగాణలో ఉన్న అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కోరింది.
ఆసియా దేశాలతో జర్మనీ నిర్వహించే వ్యాపార వాణిజ్య అవకాశాలను చర్చించే ఈ సమావేశానికి సుమారు అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వాణిజ్య వేత్తలు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు హాజరవుతారని ఆసోసియేషన్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలుచేస్తున్న పలు సంక్షేమ, ఆర్థిక విధానాలపైన జర్మన్ వ్యాపార వర్గాలకు ఆసక్తి ఉందని అందుకే తమదేశంలోని అగ్రస్థాయి వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామంది. దీనికి ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించాలని కోరింది. ఈ సమావేశంతో తెలంగాణ, జర్మన్ మధ్య వాణిజ్య బంధం మరింత విస్తృతమవుతుందని అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణలోని వ్యాపారావకాశాలపైన సంస్ధ ప్రత్యేకంగా అసక్తి వ్యక్తం చేయడం పట్ల, సమావేశానికి ప్రత్యేక అహ్వానం రావడం పట్ల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు.