అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజలు బతికే విధంగా పని చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అధికార నివాసం అని, ప్రజల బాధలు తీర్చే కేంద్రమని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రాజెక్ట్ భక్తరామదాసు ఎత్తిపోతల పథకం అని …సీతారామ ప్రాజెక్ట్ కంటే ముందే భక్తరామదాసు నిర్మిస్తామంటే సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు.సాగునీరు అందితే కుటుంబానికి సర్వస్వం అందినట్టేనని, అన్నం పెట్టే రైతు సుఖంగా ఉంటేనే తమకు సంతోషం అన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, మదన్ లాల్, జలగం వెంకట్రావు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
