Home / SLIDER / సింగరేణి కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు కావాలి..సీఎం కేసీఆర్

సింగరేణి కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు కావాలి..సీఎం కేసీఆర్

సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సమకూరిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టు (డి.ఎం.ఎఫ్.టి.) నిధులతో పాటు ఇతరత్రా సమకూరే నిధులు వినియోగించి రహదారుల నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, జలగం వెంకట్రావు, కోవ లక్ష్మి, పుట్ట మధు, పాయం వెంకటేశ్వర్లు, దివాకర్ రావు, కోరం కనకయ్య, మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల కలెక్టర్లు దేవసేన, ప్రశాంత్ పాటిల్, హన్మంతు, అభయ్ కుమార్, కన్నన్ తదితరులు పాల్గొన్నారు.

‘‘సింగరేణి గనుల ద్వారా ఎంతో విలువైన ఖనిజ సంపద బయటకు వస్తుంది. అది జాతి అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ ఇదే సమయంలో బొగ్గు గనులున్న ప్రాంతాలు మాత్రం ఛిద్రమైపోతున్నాయి. రోడ్లు పూర్తిగా పాడవుతున్నాయి. దుమ్ము వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కేవలం బొగ్గు గనులున్న ప్రాంతాలే కాకుండా, అక్కడి నుంచి బొగ్గు తరలించే మార్గాల్లో కూడా రోడ్లు బాగా దెబ్బతింటున్నాయి. కాబట్టి బొగ్గు గనులున్న ప్రాంతాలు, వాటి ప్రభావం కలిగిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. సింగరేణి గనులున్న గ్రామాలన్నీ మారుమూల ప్రాంతాలు, ఏజన్సీ ప్రాంతాలే. అక్కడ మౌలిక సదుపాయాలు కూడా అరకొరగానే ఉంటాయి. వాటికి తోడు సింగరేణి బొగ్గు రవాణా వల్ల మరికొన్ని అసౌకర్యాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతోనే జిల్లాల పునర్విభజన సందర్భంగా కొత్తగూడెం, భూపాలపల్లి , ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేసుకున్నాం. ఆయా జిల్లా కేంద్రాలలో అభివృద్ధి పనులు జరగాలి. మౌలిక వసతులు కల్పించాలి. సింగరేణి సంస్థ ద్వారా వచ్చే నిధులతో ఏర్పడిన డి.ఎం.ఎఫ్.టి. నిధులు దాదాపు రూ.1500 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల(ఎల్.డబ్ల్యు.ఇ) అభివృద్ధి నిధులు, నరేగా నిధులు, ఇరిగేషన్ నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమకూరే నిధులన్నింటినీ అనుసంధానం చేసుకుని సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉందో గుర్తించి, దాని ప్రకారం పనులు చేపట్టాలి. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ది పనులను నిర్దారించి, నిధులు విడుదల చేయాలి. ఈ నిధులతో చేపట్టే పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

హామీలన్నీ నెరవేరాలి: సిఎం
సింగరేణి ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలతో పాటు, ఇటీవల సింగరేణి ప్రాంతాలు పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన 17 హామీలను నూటికి నూరు శాతం అమలు చేయడం కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, అన్నింటినీ అమలు చేస్తున్నామని సిఎండి శ్రీధర్ తెలిపారు.

సిఎండికి, కార్మికులకు సిఎం అభినందనలు :

2017-18 సంవత్సరంలో 6.2 శాతం వృద్ధిరేటుతో రికార్డు స్థాయిలో 646 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి సిఎండి శ్రీధర్, కార్మికులను ఈ సందర్భంగా సిఎం అభినందించారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో 91.1 శాతం పి.ఎల్.ఎఫ్. తో విద్యుత్ ఉత్పత్తి జరగడం పట్ల కూడా సిఎం సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో చెప్పినట్లే తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తున్నదని చెప్పారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు

శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినందుకు విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat