తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడిప్పుడు తమ మెదడుకు పదును పెడుతున్నారని అంటున్నారు.కాస్య సభ్యత సంస్కారం అలవాటు చేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎందుకీ కామెంట్లు అంటే…తెలంగాణ సీఎం కేసీఆర్పై ఇన్నాళ్లు విమర్శలు చేసిన టీటీడీపీ నేతలు ఇప్పుడు సభ్యతను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ రోజు హైదరాబాద్లో అదే జరిగింది.
టీడీపీ మహానాడు సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. అయితే పార్టీ నేతల ఆదేశాలనుసారం సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ.. ఆయన పథకాలను విమర్శిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వెటకారాలు ఆడుతూ కళాకారులు పాట పాడటం మొదలుపెట్టారు. పాటలో అసభ్యకర పదాలు ఉండటంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కలుగజేసుకున్నారు. వెంటనే పాటను ఆపించేశారు. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ పాట పాడిన కళాకారులను మందలించారు.
అంతేకాకుండా మహానాడు వేదికపై ఇలాంటి పాట పాడినందుకు టీడీపీ తరపున క్షమాపణ చెప్పారు. ఇలాంటి పాట పాడాల్సింది కాదని.. ఇలాంటి వాటికి టీడీపీ వ్యతిరేకం అని సభా ముఖంగా వెల్లడించారు. వేదిక నుంచే మన్నించాలని ఎల్.రమణ కోరారు. తప్పులు చేసి ఉంటే.. ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఇలాంటి పదాలతో పాట పాడిన కళాకారులను.. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఇలాంటి పాట పడినందుకు చింతిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు.