రైతుబంధు పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “రైతాంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఇంకా ఎంతో చేయాలన్న తపన మదిలో మెదులుతూనే ఉంది. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం రైతులు ఎన్ని బాధలు పడతారో ఒక రైతుగా నాకు తెలియంది కాదు. ఒక దశలో పెట్టుబడికోసం ఇండ్లు, భూములు, నగదు కుదవపెట్టి, అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకునే దుస్థితి ఉండేది. ఇంతా చేస్తే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. వచ్చినా గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో తెలియదు. ఫలితంగా రైతులు అప్పులపాలై చితికిపోయేవారు. ఈ పరిస్థితుల్లో నుంచి రైతును బయడపడేయాలి, వ్యవసాయం లాభసాటిగా మార్చాలి. ఎంత భారమైనా సరే, రైతులను మరింతగా ఆదుకోవాలి. వారి ముఖంలో ఆనందం చూడాలి అనే నిరంతర ఆరాటంలోంచి, ఉద్భవించిందే రైతుబంధు పథకం.
రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి రూ. 8 వేల రూపాయల చొప్పున ఈ ఏడాది నుంచే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నాం. తొలి విడత చెక్కుల పంపిణీతో గ్రామాలలో, ముఖ్యంగా రైతాంగంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది. పంట పెట్టుబడికోసం వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని తొలగించింది. ఈ పథకం ప్రారంభంతో నేడు ఇన్నినాళ్ళకు రైతుమోములో ఆనందాన్ని చూడగలుగుతున్నాం. ఈ పథకం ఇతర రాష్ట్రాలలోనేకాదు, విదేశాలలో వుంటున్నవారిలో కూడా చైతన్యం కలిగించింది. కొంతమంది సంపన్నవర్గాలకు చెందిన రైతులు, దాతలు తమకు ఇచ్చిన పెట్టుబడి మొత్తాలను తిరిగి రైతు సంక్షేమానికే వినియోగించమని ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు. దీనితోపాటుగా పథకంలో తామూ భాగస్వాముల మవుతామని, శక్తికొలది విరాళాలు అందిస్తామని ముందుకు వస్తుండటం ఆనందాన్నిస్తోంది. ఇతర రాష్ట్రాలలోని కొన్ని పార్టీలు మన కార్యక్రమాలకు ఆకర్షితమై ఆయా పథకాలను యధాతథంగా వారివారి పార్టీల ఎన్నికల ప్రణాళికలలో పెట్టుకోవడం విశేషం.
రైతులకు జీవిత బీమా
రైతులకు భూమి తప్ప మరే జీవనాధారం ఉండదు. రాష్ట్రంలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఒక్క ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అటువంటి పేద రైతులు ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే, వారి కుటుంబాలు ఉన్నట్టుండి అగాధంలో పడిపోతాయి. చమటోడ్చి లోకానికి అన్నం పెట్టే రైతు కుటుంబానికి అటువంటి దుర్గతి పట్టనివ్వవద్దని ప్రభుత్వం యోచించింది. కుటుంబాన్నిపోషించే పెద్ద దిక్కును కోల్పోయినా వారి కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో రైతులకు జీవితబీమా పథకాన్ని ప్రారంభిస్తున్నది. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా, అతడి కుటుంబానికి పది రోజుల్లోగానే 5 లక్షల రూపాయల జీవిత బీమా మొత్తం అందితీరుతుంది. ఈ బీమా కోసం అవసరమైన ప్రీమియం డబ్బులను రైతు మీద ఒక్క పైసా భారం వేయకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. జీవితబీమా రంగంలో అనుభవం, విశ్వసనీయత, విస్తృత యంత్రాంగం కలిగిన లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – ఎల్.ఐ.సి. ద్వారా ప్రభుత్వమ రైతులకు జీవిత బీమా పథకం అమలు చేస్తున్నది. ఈ పథకం కోసం రైతులు కోరుకున్న వారినే నామినీలుగా చేర్చాలని అధికారులను ఆదేశించాం. నామిని వివరాలు తెలుపుతూ రైతులు దరఖాస్తులు ప్రభుత్వానికి అందించే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుంది. ఆగస్టు 15నుంచి రైతులకు బీమా పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభవుతుంది. ఇవి కేవలం బీమా పత్రాలు కావు, ఇవి రాష్ట్రంలోని రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న భద్రతా పత్రాలు” అని అన్నారు.