మహిళల క్రికెట్లో రికార్డులమోత మోగిస్తున్న భారత వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. కౌలాలంపూర్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ లో భాగంగా ఇవాళ శ్రీలంకతో జరిగన మ్యాచ్ లో మిథాలీ రాజ్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆమె ఇంటర్నేషనల్ టీ20ల్లో భారత్ తరపున 2వేల పరుగుల మైలురాయిని దాటిన ఫస్ట్ భారత క్రికెటర్ గా ఘనత సాధించారు.
ఇప్పటి వరకూ ఇంటర్నేషనల్ టీ20ల్లో భారత్ తరపున మహిళా, పురుషుల జట్టుల్లో ఏ ఒక్కరు ఈ రికార్డును అందుకోలేదు.అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్లో మిథాలీ చేసిన పరుగులను కలుపుకొని ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ల్లో మొత్తం 2015 పరుగులను పూర్తి చేశారు. పురుషుల విషయానికొస్తే.. సెంచరీల మీద సెంచరీలు బాదే టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఈ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు.1983 పరుగులు చేసిన కోహ్లీ, మిథాలీ తరువాతి స్థానంలో ఉన్నారు.