తెలంగాణ కాంగ్రెస్ అంటే తామే అనుకునే నాయకులు అధిష్టానం దృష్టిలో ఎంతగా దిగజారి పోయారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. సాక్షాత్తు పార్టీ రథసారథి రాహుల్గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను తలెత్తుకోకుండా చేసేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. 23 మందితో ఏర్పాటైన ఈ కమిటీ ఈనెల 22వ తేదీన సమావేశం కానుంది. విచిత్రమేమిటంటే ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికీ స్థానం దక్కకపోవడం. ఈ 23 మందితోపాటు 19 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారని పీటీఐ వార్త సంస్థ పేర్కొంది.
మొత్తం 51మందితో ఏర్పాటు చేసిన కమిటీలో 23మంది రెగ్యులర్ మెంబర్స్ ఉండగా, 18మంది శాశ్వత ఆహ్వానితులు, 10మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. అయితే తెలంగాణ, ఏపీ నుంచి ఒక్క నేతకు కూడా కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలో చోటు దక్కలేదు. రాహుల్, సోనియా, మన్మోహన్, మోతిలాల్ ఓరా, ఆజాద్, ఖర్గే ఆంటో ని, అహ్మద్ పటేల్, అంబికా సోని, ఉమెన్ చాందీ, సిద్దరామయ్య, తరుణ్ గోగోయ్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్ తో పాటు మరికొందరు నేతలు CWC మెంబర్లుగా ఉన్నారు.
కాగా, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్గాంధీ షాక్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలే పత్రికా ప్రకటనలు విడుదల చేసి మరీ హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఏఐసీసీ సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ ఖాదీ & గ్రామీణ పరిశ్రమల మాజీ అధ్యక్షుడు జి.నిరంజన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. “
పార్టీ ప్రతిష్టకు కృషి చేయకుండా అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతున్న తెలంగాణ నాయకులనెవరినీ నేడు ప్రకటించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో తీసుకోనందుకు రాహుల్ గాంధీ అభినందనీయులు. తెలంగాణ కాంగ్రెస్ అంటే తామే అనుకునే నాయకులు అధిష్టానం దృష్టిలో ఎంతగా దిగజారి పోయారో స్పష్టమైనది“ అంటూ ఆయన ప్రకటించడం గమనార్హం.