ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర ముగిసింది. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో పర్యటిస్తున్న జగన్.. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. అంతకుముందు విజయ సంకల్ప స్తూపం వద్దకు జగన్ చేరుకోగానే జై జగన్.. జై జై జగన్ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
వేదపండితులతో పాటు మతపెద్దలు ఆయనకు అశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలకు జగన్ చేతులెత్తి అభివాదం చేశారు. పాదాయత్ర 2017, నవంబర్ 6న ఇడుపుల పాయలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమయింది. ఇందులో భాగంగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు మేర జగన్ నడిచారు.