రెండేళ్లలో తెలంగాణలోని రహదారులన్నీటినీ బాగు పరిచి అద్దంలా మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారుల కే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా, రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బిటి రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది? వాటిని అద్దంలా తయారు చేయడానికి ఏం చేయాలి? అనే విషయంపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దీనికి అవసరమైన బడ్జెట్ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శులు సునిల్ శర్మ, రామకృష్ణ రావు, ఆర్ అండ్ బి ఇఎన్సీ గణపతిరెడ్డి, ఎస్.ఇ. చంద్రశేఖర్, సిఎంఓ అధికారులు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం ద్వారా రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు సాధించుకున్నామని., రాష్ట్రంలో ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకా రాష్ట్రంలో అవసరమైన చోట రహదారులకు, శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలకు మరమ్మతులు చేయాలని, ఇరుకు బ్రిడ్జిలను వెడల్పు చేయాలని తెలిపారు. దీనికోసం ఈఎన్సీ., నుంచి ఎఇ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి ఆర్ అండ్ బి అధికారుల సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి ప్రతీ రోడ్డు పరిస్థితిని సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాల న్నారు. ఫలానా జిల్లా, మండలం అనే తేడా లేకుండా, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధుల పార్టీల బేధాలను పక్కన బెట్టి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా రోడ్ల మరమ్మతు పనులను చేయించుకోవాలని సూచించారు.
పంచాయతీ రాజ్ నుంచి ఆర్ అండ్ బికి, ఆర్ అండ్ బి నుంచి జాతీయ రహదారులకు రోడ్లు బదిలీ అయిన సందర్భంలో, వాటి నిర్వహణ, మరమ్మతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రోడ్లు నిర్మాణం అయ్యే వరకు పాత రోడ్లు పాడుపడినా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీని వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. రోడ్లను బదిలీ చేసే సందర్భంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణం చేపట్టామని, వాటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాల న్నారు. కొత్తగా నిర్మించిన క్వార్టర్లను ఎమ్మెల్యేలకు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.