చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి షాకులు ఇచ్చే ఎపిసోడ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో ఆయన పార్టీ పెద్దలను ఆయన ముప్పుతిప్పలు పెడుతుండగా, తాజాగా మరో బాంబు పేల్చారు. టీడీపీ పెద్దల రిక్వెస్ట్ మేరకు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి సిద్దా రాఘవరావుతో కలిసి చంద్రబాబుతో సమావేశమైన ఆమంచి… తన నియోజకవర్గ పరిధిలో ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు.
చీరాలలో నాకు, ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పని చేశాయని ఆమంచి ఆరోపించారు. కులాల గురించి ఇప్పుడు మాట్లాడను.. కానీ, కొన్ని శక్తులు మాత్రం అడ్డంకులు కల్పించాయన్న ఆయన.. చీరాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లోకేష్ వస్తానంటే కొందరు వివాదాలు సృష్టించి ఆపేశారన్నారు. లోకేష్ వస్తున్నారని ప్రకటనలు ఇచ్చాక కూడా రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఎందుకు రాలేదని అధిష్టానాన్ని అడిగితే సంతృప్తికర సమాధానం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆమంచి. ఈ విధంగా లేని వివాదాలు సృష్టించే శక్తులు పార్టీలో ఉన్నాయి. నా నియోజకవర్గంలో కార్యక్రమాలను నాకు తెలియకుండానే రద్దు చేస్తున్నారన్నారు. పార్టీ ఇక్కడ ఉంటోందా..? పాకిస్థాన్లో ఉంటోందా..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ శక్తులు పార్టీ లైన్ దాటి పని చేస్తున్నారని మండిపడ్డారు.
నియోజకవర్గంలో తనకు ఎవరు ప్రత్యర్థులు లేరని…సమస్యలే తన ప్రత్యర్ధులు అన్న ఆమంచి కృష్ణమోహన్… సహచర ఎమ్మెల్యేలు పోతుల సునీత, దామచర్ల పేర్లు నేనెక్కడా ఉచ్చరించలేదని స్పష్టంచేశారు. చంద్రబాబు వద్ద కూడా నేను ఈ మాటలు చెప్పలేదన్నారు ఆమంచి.. అయితే, వైసీపీతో 10 రోజులుగా సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే అని అంగీకరించారు. తోట త్రిమూర్తులతో రాజకీయ, కులపరమైన చర్చలు జరిపిన మాట వాస్తవమేనన్న ఆమంచి.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పైనా తోట త్రిమూర్తులతో చర్చించి సలహాలు తీసుకున్నట్టు వెల్లడించారు. అధిష్టానం నన్ను గౌరవించింది కాబట్టే.. చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు వచ్చాను. చంద్రబాబుతో చర్చల తర్వాత నేను సంతృప్తి చెందాను… కానీ, అనుచరులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటానని మళ్లీ పార్టీ మార్పు విషయాన్ని సస్పెన్స్లో పెట్టారు. దీంతో ఆమంచి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ జరుగుతోంది.