తెలంగాణలోని ఉద్యోగార్థులకు గొప్ప తీపికబురు. ప్రపంచ ప్రసిద్ధ కన్సల్టింగ్ సంస్థ హైదరాబాద్లో కొత్తగా 40,000 నియామకాలు జరపనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో భారత్ లోనే తన అతిపెద్ద కేంద్రమైన హైదరాబాద్ లో ఉద్యోగుల సంఖ్యను సుమారుగా 80,000కి పెంచాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఏదంటే…ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకటైన డెలాయిట్.
డెలాయిట్కి ప్రస్తుతం హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 40,000 మంది ఉద్యోగులున్నారు. ఇక్కడ ప్రపంచ మార్కెట్ కోసం సంస్థ జరిపే కొన్ని కీలక ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా ఉంది. ‘హైదరాబాద్ లో మాకు ఇప్పుడు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతానికి ఇదే అతిపెద్ద కార్యాలయం. కానీ కొన్నేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు చేయనున్నాం’ అని డెలాయిట్ ఇండియా టెక్నాలజీ, మీడియా, టెలికామ్ లీడర్ హేమంత్ జోషి తెలిపారు. అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి, ఇతర మార్గాలలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన చాలా మంది ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులను ప్రత్యేక టెక్నాలజీ నైపుణ్యాలు, ఇతర రంగాలలో నియమిస్తున్నట్టు జోషి వివరించారు.
టాక్సేషన్, మొబిలిటీ, ఐటీ సిస్టమ్స్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్, కన్సల్టింగ్ సర్వీసెస్, సిస్టమ్ ఇంటెగ్రేషన్, ఫైనాన్స్ ఫంక్షన్స్ వంటి డొమైన్ లలో నియామకాలు జరుపనున్నట్టు డెలాయిట్ గ్లోబల్ టెక్, మీడియా, టెలికామ్ ఇండస్ట్రీ లీడర్ పాల్ సలోమీ చెప్పారు. కాగా, భారత్లో కంపెనీకి ముంబై, బెంగుళూరు, ఢిల్లీ (గురుగ్రామ్)లలో కూడా కీలక కార్యాలయాలు ఉన్నాయి. రాబోయే కొన్నేళ్లలో అక్కడ కూడా ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నారు. దేశంలో డెలాయిట్ కి బెంగుళూరు రెండో పెద్ద కేంద్రంగా ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి 9,000-10,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.