చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఫిబ్రవరి 13న టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే ఆమంచి పార్టీ మారి కాపులకు ద్రోహం చేశారని ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆమంచి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు కుల రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని ఆమంచి మండిపడ్డారు. “ప్రతి కులాన్ని అవమానపరిచేందుకు చంద్రబాబు ఓ వ్యక్తిని ఎంచుకుంటాడు. హోంమంత్రి పదవి చిన్న రాజప్పకు ఇస్తే రాష్ట్రంలోని కాపులందరూ సంతోషించారు. కానీ ఆ కోటి మందిని అవమానపరచడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారన్న వాస్తవాన్ని ప్రజలు వెంటనే అర్థం చేసుకున్నారు“ అని ఎమ్మెల్యే ఆమంచి తెలిపారు. ఓ మంత్రికి ఉండాల్సిన ప్రోటోకాల్ కూడా చిన్నరాజప్పకు లేదని ఆయన విమర్శించారు. చిన్న రాజప్పకు దమ్ము, ధైర్యం ఉంటే సొంత నియోజకవర్గంలో డ్వాక్రా గ్రూపు మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి రుణమాఫీ, పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సవాల్ విసిరారు. ఈ సవాలుపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.