కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెకు జగన్ వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ప్రత్యేక హోదా నినాదం సజీవంగా ఉండడానికి కారణం జగన్ అని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. యూపీఏలో ఎందుకు చేరలేదు?. చంద్రబాబు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “అజెండా సెట్ చేసింది జగన్.. రియాక్ట్ అయింది చంద్రబాబు. కమిట్ మెంట్ ఉన్న నాయకుడు, రాటుదేలిన రాజకీయ నాయకుడు వైఎస్ జగన్“ అని కిల్లి కృపారాణి అన్నారు.
నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ప్రత్యేక హోదా తీసుకురాలేదని కృపారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. “విశాఖ జోన్ సాధన వైసీపీ పోరాట ఫలితమే. ప్రత్యేక హోదాను మోడీ కాళ్ళ కింద తాకట్టు పెట్టారు. సంతలో పశువుల్లా వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. దోపిడీ కొనసాగుతుంది, దుబారా చేస్తున్నారు.. ప్రజలపై భారం మోపారు. పసుపు కుంకుమ పథకం పెద్ద స్కాం. డ్వాక్రా మహిళలను మోసం చేశారు. 6 లక్షల 30వేల గ్రూపుల డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేయలేదు“ అని ఆమె మండిపడ్డారు. `నీచమైన రాజకీయాలకు చరమగీతం పాడాలి. చంద్రబాబుకు గుణపాఠం చెప్పి జగన్ కు పట్టం కట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు` అని కిల్లి కృపారాణి అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్ధను దెబ్బతీశారని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.