తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో కలకలం మొదలైంది. పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా పార్టీలోని అసంతృప్తులను మరోమారు బయటపెట్టింది. పార్టీ నిర్ణయాలపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జాబితా ప్రకటన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఈ మేరకు ఏపీ వ్యవహారాల ఇంచార్జీ ఆర్సీ కుంతియాకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరితో సంప్రదింపులు లేకుండా, రాష్ట్ర ఎన్నికల కమిటీలో చర్చించుకుండా సొంతంగా నిర్ణయం తీసుకున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కమిటీ సిఫారసులు లేకుండా ఎంపీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్రంలోని పార్టీ సీనియారిటీలో తాను, పార్టీ నేత గీతారెడ్డి మొదటి వరుసలో ఉంటామని, అయినప్పటికీ తమకు కనీస సమాచారం, సలహాలు, సంప్రదింపులు లేకుండా పూర్తి చేశారని అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎవరితో సంప్రదింపులు లేకుండా ఇలా ప్రక్రియ పూర్తయితే, కమిటీ అర్థం ఏంటని అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, పొన్నాల ఫిర్యాదు నేపథ్యంలో ఉత్తమ్ సీటు ఉంటుందా? ఊడుతుందా? అనే చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నదానికి తోడుగా తాజా ఎపిసోడ్ వల్ల ఆయనపీఠానికి ఎసరురావచ్చని అంటున్నారు.