తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు చేస్తున్న ఎత్తుగడల గురించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 6000 వేల కోట్ల పైగా ఎన్నికల్లో పెట్టుబడిగా టీడీపీ పెడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏపీలో టీడీపీ చేస్తున్న ధన రాజకీయంపై కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ..
70 కోట్ల పైన ఖర్చు పెట్టగల అభ్యర్థులను ఎంపిలుగా, 25 కోట్లు పైనే ఖర్చుపెట్టగల వారిని ఎమ్మెల్యే లుగా టీడీపీ నిలబెట్టిందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. సామాన్యులు 2000 రూపాయలు నోటు చూసి చాలా రోజులు అయిందని అన్నారు. ఎన్నికల సమయంలో బ్యాంక్ లావాదేవీల పట్ల ఆర్బీఐ పర్యవేక్షణ ఉండాలని ఈసీకి పిర్యాదు చేస్తామన్నారు. 5 ఏళ్లుగా చంద్రబాబు ఏపీకి ఏమి చేశారో చెప్పే స్థితిలో లేరన్నారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడిన మాటలనే మాట్లాడుతున్నారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కళ్యాణ్లా మారారని మండిపడ్డారు. తెలంగాణలో ఏపీ వాళ్ళని తరిమి కోడుతున్నారని చెప్పే పవన్ ఆ ఘటనలు ఎక్కడ జరిగాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.