కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజులు వద్ద ఇంజనీర్లు, సిబ్బంది బస చేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్ టవర్ నిర్మించాలన్నారు. సబ్ స్టేషన్లు వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి ఏర్పాట్లు చేయాలని, మేడిగడ్డ బ్యారేజి వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి ఏర్పాట్లు చేయాలని, మేడిగడ్డ బ్యారేజి వద్ద పోలీస్ క్యాంపు ఏర్పాటు చేయాలని, బ్యారేజీల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లు నిర్మించాలని సీఎం సూచించారు.
బ్యారేజీల వద్ద నది ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ, ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హై ఫ్లడ్ లెవల్ కు చాలా ఎత్తులో వాచ్ టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలని సీఎం చెప్పారు. ప్రస్తుతమున్న హెచ్ఎఫ్ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్ఎఫ్ఎల్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల ద్వారా చెరువులను నింపడానికి చేసిన ఏర్పాట్లను సీఎం అడిగి తెలుసుకున్నారు. కాల్వలకు మూడు వేలకు పైగా తూములు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపడానికి ప్రణాళిక రచించినట్లు అధికారులు తెలిపారు. గతంలో చెరువులు నింపుకోవడానికి రైతులు కాల్వలు తెంపే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వమే కాలువలకు తూములు ఏర్పాటు చేస్తున్నదని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీటితో చెరువులు నిండడంతో పాటు, వర్షం ద్వారా కూడా నీరు వస్తుందని, దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని సీఎం అన్నారు.