ముఖ్యమంత్రి అయిన మరుసటిరోజే సచివాలయంకి వచ్చి శుక్రవారం బాధ్యతలు స్వీకరించాలనుకున్న జగన్ చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు. ఆయన తన ఇంటినుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మంచి ముహూర్తంలోనే సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఆర్థిక పరిస్థితి, ఆయా శాఖల స్థితిగతులపై జగన్ వరుస సమీక్షలు జరపనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా జగన్తో భేటీ అయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల్లోని అధికారుల బదిలీలు, రాష్ట్ర పరిస్థితిపై మళ్లీ చర్చలు జరుపనున్నారు. ఇప్పటికే సీఎంవోలోని ఉన్నతాధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక అతి త్వరలోనే మరికొందరు అధికారుల బదిలీలు జరిగనున్నట్టు సమాచారం. ఇక క్యాబినెట్ ఏర్పాటు కూడా అతిత్వరలో చేయనున్నారు. జూన్ 7, లేదా 8న కేబినెట్ను ఏర్పాటుచేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మంత్రులుగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.