తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ,సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై నిన్న సోమవారం చింతమడకలో జరిగిన గ్రామ ప్రజల ఆత్మీయ సమ్మేళన సభలో ఆద్యంతం టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన చింతమడక ప్రజల కోసం హరీశ్ బాగా తిప్పలు పడ్డాడని మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ముందుగా సభలో హారీష్ రావు మాట్లాడుతూ”సిద్దిపేట నియోజకవర్గంలోని 81 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.25 లక్షల చొప్పున అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. చింతమడకతోపాటు మొన్నటిదాకా ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న కొత్త గ్రామ పంచాయతీలు సీతారాంపల్లి, మాచాపూర్తోపాటు సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.
దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించేటప్పుడు ‘‘హరీశ్ బాగా హుషారుగా టైం చూసి అడిగాడు. అది ఒక నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం’’ అంటూ ప్రశంసించారు. హరీశ్ రావు అడిగినట్లుగానే సిద్దిపేట నియోజకవర్గంలోని మండల కేంద్రాలకు రూ.కోటి, గ్రామాలకు రూ.50 లక్షలు, సిద్దిపేట పట్టణానికి రూ.25 కోట్లు ప్రకటిస్తున్నాను అని ఆయన అన్నారు.