తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రోరైల్ ద్వారా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్-హైటెక్సిటీ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త. ప్రయాణికుల కోసం తగిన సౌకర్యాలను అందిస్తున్న మెట్రో ఇప్పుడు చెక్పోస్ట్-హైటెక్సిటీ మధ్య ప్రతి 4 నిమిషాలకు మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచిచూడాల్సిన అగత్యం తప్పింది. ఇప్పటివరకు ఆ మార్గంలో ట్విన్ సింగిల్లైన్ మెథడ్ కారణంగా ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉండేది. మంగళవారం నుంచి ఆ మార్గంలో రివర్సల్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచి ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మార్గం సుగమమైందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
