తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పలు చోట్ల నెలకొన్న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. డెంగీ లక్షణాలు కొంత మారాయి. గతంలో డెంగీ వస్తే చనిపోయేవారు. ఇప్పుడు తీవ్రత తగ్గింది. రోగుల సంఖ్య పెరిగినా… త్వరగానే వ్యాధి నయమవుతోంది.
ఫీవర్ ఆస్పత్రిలో 51 వేల మందికి పరీక్షలు చేస్తే 62 మందికే డెంగీ ఉన్నట్లు తేలింది. గాంధీ ఆస్పత్రిలో 419 మందికి వ్యాధి నయం చేసి పంపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో సాయంత్రం ఓపీ నిర్వహిస్తున్నాం. సెలవు కూడా లేకుండా వైద్యులు పనిచేస్తున్నారు. మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నాం. ప్రజల్లో జ్వరాల పట్ల భయం పెంచేలా ప్రచారం చేయోద్దు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే సమస్యల నుంచి బయటపడుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క సైన్ఫ్లూ కేసు నమోదైందని తెలిపారు