నటి భాను ప్రియపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో భానుప్రియపై సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో నివసిస్తోన్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ అమ్మాయిలను నియమించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ ఇంట్లోని పని అమ్మాయి చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బాలికపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే, బాలిక తల్లి ఆ ఆరోపణలను కొట్టి పడేసింది. తన కుమార్తెను వారు ఇంట్లో నిర్బంధించి హింసిస్తున్నారని, రక్షించాలని సామర్లకోట పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న సామర్లకోట పోలీసులు చెన్నై వెళ్లి భానుప్రియను విచారించారు. మరోవైపు, చెన్నైలో భానుప్రియ పెట్టిన కేసులో ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించారు.
తాజాగా, ప్రభావతి పెట్టిన కేసును సామర్లకోట పోలీసులు చెన్నైకి బదలాయించారు. నేరం జరిగింది చెన్నైలో కాబట్టి అక్కడి పోలీసులకు అప్పగించారు. దీంతో చెన్నై పోలీసులు భానుప్రియ, ఆమె సోదరుడిపై మరోమారు బాలకార్మిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.