2014 నుంచి 2019వరకూ తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో భారీఎత్తున అవినీతి జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ కిరణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం లోకాయుక్తను ఆశ్రయించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఆయన క్యాబినేట్ లోని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో చాలామంది అందినకాడికి దోచుకుని వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో ఇసుకమాఫియా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుల్లో భారీఎత్తున అక్రమాలు జరిగాయని ఉదయ్ కిరణ్ లోకాయుక్త దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల సొమ్మును లూటీ చేసిన చంద్రబాబు, అప్పటి మంత్రులపై త్వరగా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు విజ్ఞప్తిచేశారు. అక్రమాలకు పాల్పడిన వారినుంచి అక్రమ సంపాదనను ఏపీ ప్రభుత్వం స్వాధీనపర్చుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే గత టీడీపి హయాంలో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని దాఖలైన ఫిర్యాదుపై ఇప్పటివరకూ లోకాయుక్త లేదా టీడీపీ ఇప్పటివరకూ స్పందిచలేదు.. ఇకనైనా స్పందిస్తాయో వేచిచూడాలి.