తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి.
కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ తరపున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదిహేడో తారీఖున హుజూర్ నగర్ కు వెళ్లనున్నారు అని మండలి విప్,ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
దాదాపు అరవై వేల నుండి డెబ్బై వేల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆరేళ్లుగా ఇక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయిన కానీ ఏమి ఏమి అభివృద్ధి చేశారు.రేపు గెలిపిస్తే ఏమి ఏమి చేస్తారు తదితర అంశాల గురించి నియోజకవర్గ ఓటర్లకు,ప్రజలకు వివరిస్తారని సమాచారం.