కరోనా వైరస్ను నియంత్రించేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. కరోనా వైరస్పై వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తుంటే.. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్న జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను షేర్ చేశారు.
వీడియో సారాంశం ఇదే.. కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించేందుకు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ముందు వరుసలో ఉండి అందరకీ రక్షణగా నిలుస్తున్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు 21 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. 5 వేల స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, సహాయకులు కలిసి ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి రోజూ 6 వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్తను సేకరించి తరలిస్తున్నారు. ఎంటమాలజీ విభాగానికి చెందిన 2375 వర్కర్లు(135 యూనిట్లు) నగర వ్యాప్తంగా ఫ్యుమిగేషన్ కార్యకలాపాలు చేస్తున్నారు. ఇందు కోసం 1,000 పవర్ స్ప్రేయర్లు, 817 క్నాప్సాక్ స్ప్రేయర్లు, 63 వెహికిల్ మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్లు, 305 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లు ఉపయోగిస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్)కు చెందిన 675 మంది సిబ్బంది.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విభాగాల నుంచి 31 వేల మందికి పైగా కార్మికులు కరోనా నియంత్రణ చర్యల్లో నిమగ్నమయ్యారు.