మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్.. తెలంగాణలో అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, కూడవెళ్లి, రాయపోల్లో మంత్రి పర్యటించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 162 సంఘాల ప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులతో దుబ్బాకలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం ఉన్నదన్నారు. 30 లక్షల మందికి నెలనెలా రూ.2 వేల చొప్పున పింఛన్లు అందజేస్తున్నదన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేయలేని సంక్షేమం స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారులోనే అన్ని వర్గాల వారికి సమ న్యాయం దక్కుతున్నదన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. వచ్చే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన నిలిచి మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.