తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్శాఖ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సమీక్షించారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని అభినందించారు.
వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిపై సీఎంకు విద్యుత్ సంస్థ సీఎండీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక *చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, వరదలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయని, *స్తంభాలు దెబ్బతిన్నాయని, వైర్లు తెగిపోయాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వానలు, వరదల ఉధృతి తగ్గలేదని, *జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదన్నారు.
హైదరాబాద్తో పాటు చాలా పట్టణాల్లో అపార్ట్మెంట్లు నీటితో నిండి ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేయడం జరిగిందని, పరిస్థితిని బట్టి మళ్లీ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడి వరకు సిబ్బంది చేరుకోగలుగుతున్నారో అక్కడి వరకు వెళ్లి 24 గంటల పాటు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు సీఎండీ ముఖ్యమంత్రికి వివరించారు.