సిద్దిపేట జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. మంత్రి హరీశ్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తూ సిద్దిపేటపై సీఎం వరాల జల్లు కురిపించారు.
రూ. 100 కోట్ల రంగనాయకసాగర్ అభివృద్ధి..
తెలంగాణకే ఒక అందమైన, సుందర స్పాట్గా రంగనాయక్సాగర్ తయారు కావాలని సీఎం అన్నారు. నీళ్ల మధ్యలో 65 ఎకరాల జాగా ఉంది. గొప్ప పర్యాటక ప్రాంతంగా తయారు అయితది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, అద్భుతమైన స్టార్ హోటళ్లతోని ఇక్కడ చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరగాలన్నారు. నాయకుడు(హరీశ్రావు) చాలా గట్టోడు ఉన్నాడు కాబట్టి దాన్ని సాధిస్తాడు. ఇందులో అనుమానం అవసరం లేదన్నారు. రంగనాయకసాగర్ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఇరుకోడు లిఫ్ట్ పేరుతో మిగిలిన గ్రామాలకు నీళ్లు..
మూడు నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ కింద కొన్ని గ్రామాలు మిగిలాయి అన్ని సీఎం మల్లన్నసాగర్ దగ్గర లిఫ్ట్ పెడితే ఈ గ్రామాలు కూడా కవర్ అవుతాయన్నారు. సిద్దిపేట మండలంలో గుస్సాపూర్, ఇరుకోడు, తోర్నాల, వెంకటాపూర్, గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలోని సిరసనగండ్ల, మరపడక, దుబ్బాక నియోజకవర్గంలో పది గ్రామాలు. పెద్దగుండవెల్లి, తిమ్మాపూర్, తోగుట మండలంలో బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, పెద్దమాసానిపల్లి, ఘన్పూర్, గుడికందుల, మిర్దొడ్డి మండల కేంద్రంతో సహా, మిర్దొడ్డి, ధర్మారం, కొండాపూర్ గ్రామాలకు నీళ్లు అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే జీవో జారీ చేస్తామన్నారు.
రూ.165 కోట్లతో సిద్దిపేట నియోజకవర్గ రింగ్ రోడ్డు..
రూ. 165 కోట్ల వ్యయంతో సిద్దిపేట నియోజకవర్గ రింగ్ రోడ్డు(డబుల్ లైన్) ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటికే ప్రతిపాదనలు తయారు అయినట్లు తెలిపారు. రాజీవ్ రహదారి-రాజీవ్ రహదారి( పొన్నాల కాడ మొదలై దుద్దెడకు వచ్చి కలిసేవిధంగా) 75 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మాణం. పొన్నాల, కిష్టసాగర్, ఎన్సానపల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్, ఇర్కోడ్, రాంపూర్, రావురూకల, పుల్లూరు, మల్యాల, గంగాపూర్, మచాపూర్, చిన్నకోడూరు, రామునిపట్ల, గోనేపల్లి, ఒబులాపూర్, పాలమాకుల, వెంకటాపూర్, తిమ్మాయపల్లి, బందారం, దుద్దెడ రాజీవ్ రహదారి, దాదాపు 22 గ్రామాలు చుట్టుకుంటూ రింగ్రోడ్డు ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. దీన్ని కూడా తక్షణమే మంజూరు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
వీటితో పాటు
– సిద్దిపేట నుంచి ఇల్లెంతకుంట 25 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారి నిర్మాణం
– సిద్దిపేట పట్టణానికి మరో వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు
– త్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
– బస్తీ దవాఖానా ఏర్పాటు
– సిద్దిపేట కోమటిచెరువు అభివృద్ధికి మరో రూ. 25 కోట్లు మంజూరు
– రూ. 50 కోట్ల వ్యయంతో ఆడిటోరియం నిర్మాణం
*- రూ. 25 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు. * ఇందుకు సంబంధించిన నిధులను, పరిపాలన అనుమతులను తక్షణమే మంజూరు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.