తెలంగాణలోని ఒప్పంద, పొరుగుసేవల, దినవేతన, తాత్కాలిక ఉద్యోగులకు గత ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వరకు వేతనాలను పెంచిందని, దానిపై విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు సూచించారు. పట్టభద్ర ఎన్నికల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, చిరుద్యోగులకు వేతనాల పెంపు వివరాలను తెలియచెప్పాలన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ” తెలంగాణ ఉద్యమంలో తమ ఉద్యోగాలను పణంగా పెట్టి సకల జనులతో కలిసి వచ్చిన చిరుద్యోగులను రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెరాస ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. సీఎం కేసీఆర్ ఒక కుటుంబ పెద్దగా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకొని వారి జీతాలను రెట్టింపు చేశారు.గతంలో ఏ సీఎం చేయని విధంగా ప్రగతిభవన్లో వివిధ సంఘాలతో కలిసి కేసీఆర్ సహపంక్తి భోజనం చేసి, వారి సాధకబాధకాలు తెలుసుకొని నిర్ణయాలు ప్రకటించారు. అంగన్వాడీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా వేతనాలను ఇస్తున్నారు.
ఆశా వర్కర్ల జీతాన్ని దాదాపుగా ఐదు రెట్లు పెంచారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రెట్టింపు చేసి సలాం సఫాయన్న అన్నారు. గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.8500 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డిగ్రీ, జూనియర్ కళాశాల్లోని ఒప్పంద, పార్ట్టైమ్ అధ్యాపకులు, గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల జీతాలను భారీగా పెంచారు.హోంగార్డులకు వేతనాన్ని భారీగా పెంచారు. ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య భత్యాలను పెంచారు. అర్చకులకు వేతన స్కేళ్లు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న జీతాలు, ప్రస్తుతం ఉన్న జీతాలకు సంబంధించిన వివరాలతో చిరుద్యోగులను, వారి కుటుంబాలను కలిసి తెరాస ప్రభుత్వం చేసిన మేలును వివరించి పార్టీ అభ్యర్థులకు ఓట్లను సాధించాలి ” అని కేటీఆర్ సూచించారు.