యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి మధ్యాహ్నం 12.22 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వద్ద ముఖ్యమంత్రి దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం రాక సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం సీఎం కేసీఆర్ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. దేశానికే తలమానికంగా చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.
త్వరలోనే స్తంభోద్భవుని దర్శనభాగ్యం భక్తులకు కలగనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. గతేడాది సెప్టెంబర్ 13న సీఎం ఆలయానికి వచ్చారు. మళ్లీ ఐదున్నర నెలల తర్వాత యాదాద్రికి రాగా.. ఈ పర్యటనలో స్వామి వారి పునః దర్శనాలపై సీఎం స్పష్టత ఇస్తారని భక్తులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రూ.1200 కోట్లతో పంచనారసింహ క్షేత్రం పునః నిర్మాణ పనులను 2016 అక్టోబర్ 11న ప్రారంభించారు. కృష్ణశిలతో నిర్మించిన ఆలయం ప్రస్తుతం పూర్తి కావచ్చింది. 4.33 ఎకరాల్లో అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో ఆలయం అలరాలుతోంది.