దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య బడుగు, బలహీన వర్గాల బాంధవుడు అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈరోజు శాసనసభలో నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాలుగా నోములతో అనుబంధం ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు లేవు.
15 వేల పైచిలుకు జనాభా ఉండే మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో సాగర్ నియోజకవర్గంలోని నందికొండ, హాలియాను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశాం. ఈ మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు ఉన్నాయి.. పరిష్కరించాలి అని నోముల తనను పదేపదే కోరేవారు. అణగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడిగా నోములకు పేరుంది.
ఎన్నో సందర్భాల్లో ఆయన తెలంగాణ గురించి మాట్లాడేవారు. నోముల మరణం సాగర్ నియోజకవర్గానికే కాకుండా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. నోముల మరణం పట్ల తీవ్రమైన సంతాపం తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.*