తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేయాలని, రైతును రాజు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నేడు మహబూబాద్ జిల్లా, ములుగు నియోజకవర్గం, ఏటూరు నాగారం ఐటిడిఏ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న కొత్తగూడ, పొగుళ్లపల్లిల్లో రైతు వేదికలను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రారంభించారు.
కరోనా కష్టకాలంలోనూ రైతుకి ఇచ్చే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా నిధులు విడుదల చేస్తూ ఈ ప్రభుత్వానికి రైతు పట్ల ఉన్న అంకిత భావాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాటిచెప్పారన్నారు.
వానకాలం సీజన్లో వర్షపు చినుకు భూమికి చేరకముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని జమ చేసి రైతు నేస్తంగా ఆయన నిలబడ్డారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి బిందు, కలెక్టర్ వి.పి గౌతమ్, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు జెండగే, అదనపు ఎస్పీ యోగేశ్ గౌతం, ఇతర అధికారులు, రైతు నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.