త్వరలో జరగనున్న మా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ను కూడా ప్రకటించాడు. అయితే ఆయనని పరభాషా వ్యక్తి అని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ .. సినిమా అనేది ఒక భాష. మన ఆలోచన విశ్వజనీయంగా ఉండాలి. అంతే తప్ప- వీడు మనోడు.. వీడు వేరేవాడు అనే ఆలోచనే తప్పు.
ఇప్పుడు లోకల్.. నాన్లోకల్ అని మాట్లాడుతున్నవారికి.. నేను తెలంగాణలో కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొన్నప్పుడు నాన్లోకల్ అనిపించలేదా? నా అసిస్టెంట్లకు హైదరాబాద్లో ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్లోకల్ అనిపించలేదా? నాకు ఇక్కడ పొలం ఉంది. ఇల్లు ఉంది. నా కొడుకు ఇక్కడే స్కూలుకు వెళ్తాడు. నా ఆధార్ కార్డ్ అడ్రస్సు ఇక్కడే ఉంది. మరి నేను నాక్ లోకల్ ఎలా అవుతాను?అంతఃపురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నేను నాన్లోకల్ కాలేదే! నవనందులు తీసుకున్నప్పుడు నాన్లోకల్ కాలేదే! అప్పుడు లేని విషయం ఇప్పుడు ఎలా వచ్చింది..? ఈ కామెంట్స్ చేసేవారి సంకుచిత మనస్తత్వం, వారి స్థాయి, వారి మానసిక పరిస్థితిని మనం గమనించాలి అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనేది ఇప్పుడు నిర్ణయం కాదు. దీని వెనక చాలా మథనం దాగి ఉంది. ఇది కోపంతో వచ్చింది కాదు, ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది. మూడు దశాబ్దాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నా. ఈ పరిశ్రమ నాకు పేరు, హోదా, గౌరవం అన్నీ ఇచ్చింది. ఇక్కడ జరుగుతున్నవి చూస్తూ ఉండలేకపోయాను. ఒక ఏడాది క్రితం నుంచి కళ్ల ఎదురుగా జరుగుతున్నది చూస్తూ కూర్చోవటం సరికాదనిపించింది. సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలనిపించింది. నాలా ఆలోచించేవారితో ఒక టీమ్ తయారుచేసుకున్నా అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.