హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మధ్యామ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు.కొండాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాను. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడిని అయ్యాను. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
కాళేశ్వరం, లోయర్ మానేరు ప్రాజెక్టులతో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుబంధు పథకం ఈ నియోజకవర్గం నుంచే అమలు చేశారు. తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఈటల రాజేందర్ దుర్వినియోగం చేశారు. ఈటల రాజేందర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదు. తనకు తాను అభివృద్ధి చెందేందుకు నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.