ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లను అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
చాలా రోజుల ప్రతిష్టంభన తర్వాత టికెట్ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దానికి సంబంధించి జీవో 13ను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రెమ్యునరేషన్ మినహా నిర్మాణానికే రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ అయితే అలాంటి సినిమాలకు కొన్ని మినహాయింపులు కల్పించింది. 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశమిస్తున్నట్లు జీవో నంబర్ 13లో ప్రభుత్వం పేర్కొంది. అయితే సినిమా నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.
ఇటీవల ఆర్ఆర్ఆర్ దర్శక నిర్మాతలు రాజమౌళి, డీవీవీ దానయ్య ఈ విషయంపై ఏపీ సీఎం జగన్తో పాటు మంత్రి పేర్నినానిని కలిశారు. సినిమా నిర్మాణ బడ్జెట్ వివరాలను ప్రభుత్వానికి అందజేసి అదనంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుతించాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రతి కేటగిరీలోనూ ఒక్కో టికెట్పై రూ.75 పెంచుకునేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. తొలి 10 రోజులు మాత్రమే అదనపు రేట్లు పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జీవో నంబర్ 13 ప్రకారమే థియేటర్ యాజమాన్యాలు నడుచుకోవాలి.