శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఏకంగా తన పొట్టలో 108 హెరాయిన్ మాత్రలను దాచేశాడు. వివరాల్లోకి వెళితే.. గత నెల 26న టాంజానియా దేశస్థుడు జోహనెస్బర్గ్ నుంచి శంషాబాద్ వచ్చాడు. అతడి వ్యవహారశైలిపై డౌట్ రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ తనిఖీ చేసి అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ లేనట్లు తేల్చారు.
కానీ ఆ వ్యక్తి ప్రవర్తనలో తేడా ఉండటంతో మళ్లీ అతడిని విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చేసింది. హెరాయిన్ మాత్రలకు టేప్ చుట్టి మింగేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంచి ఆరు రోజుల తర్వాత పొట్ట నుంచి టేప్ చుట్టిన మాత్రలను బయటకు తీశారు. వీటి విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.