అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘కోనసీమ’ జిల్లా పేరును మార్చవద్దంటూ అక్కడి యువకులు ఒక్కసారిగా భారీ ఆందోళనకు దిగారు. అమలాపురం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్దకు చేరుకుని ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలు చేశారు.
దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకోగా వారు తప్పించుకుని పరుగులెత్తారు. వారిని పోలీసులు వెంబడించడం.. ఈ క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి జరగడం వంటి పరిణామాలతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. రాళ్లదాడిలో పోలీసులు, యువకులకు కూడా గాయాలయ్యాయి.
ఆ తర్వాత కలెక్టరేట్ ముట్టడికి ఆందోళకారులు వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. అనంతరం.బస్సుతో పాటు మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించారు. అమలాపురంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి అదనపు బలగాలను పంపించారు. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.