ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం ఆయన నటించిన ‘గౌతమీపుత్రశాతకర్ణి’ మూవీకి పన్ను రాయితీ తీసుకున్నా టికెట్ రేట్లు తగ్గించలేదంటూ సినీ ప్రేక్షకుల సంఘం ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది.
పన్ను రాయితీ పొందినప్పటికీ.. దాన్ని ప్రేక్షకులకు బదలాయించలేదని.. టికెట్ల రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల సంఘం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. రాయితీగా పొందిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వివరణ ఇవ్వాల్సిందిగా నటుడు బాలకృష్ణతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.