Telangana State : తెలంగాణ రాష్ట్రం లోని గర్భిణులకు తెరాస ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 44 ప్రభుత్వాస్పత్రుల్లో 56 ఆధునిక టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని పెట్ల బురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రి నుంచి ఈ స్కానింగ్ సెంటర్లను వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సిజేరియన్ కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూసే బాధ్యతలను ఆశా, ఏఎన్ఎంలకు ఆరోగ్యశాఖ అప్పగించింది.
దాదాపు రూ.20 కోట్ల రూపాయలతో ఈ స్కానింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి వల్ల నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులు బాటు అందుబాటులోకి రానుంది. అదే విధంగా టిఫా స్కానింగ్ సెంటర్లను ప్రారంభించడంతో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు అయ్యే స్కానింగ్… ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా లభించనుంది. కాగా గర్భిణులకు 18 నుంచి 22 వారాల మధ్యలో ఈ స్కానింగ్ చేస్తారు. తల్లి గర్భంలోని బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలో సులువుగా ఈ అత్యాధునిక స్కానింగ్ యంత్రాల ద్వారా గుర్తించవచ్చని… దీని ద్వారా వెంటనే వైద్యం అందించవచ్చని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
ఈ కారణంగా గర్భంలో పిండ దశలోనే శిశువు పరిస్థితిని అంచనా వేసి డాక్టర్లు మందులు రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కానింగ్ ద్వారా గర్భస్థ దశలోనే పిండం ఎదుగుదలను ముందు గానే గుర్తించి, ఏమైనా లోపాలంటే చికిత్స అందిస్తారు. తల్లీ బిడ్డల సంరక్షణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అందులో భాగంగా సర్కార్ ఆస్పత్రుల్లో ఈ టిఫా స్కానింగ్ సెంటర్లను ప్రారంభించింది.