HARISHRAO: త్వరలో ఉపాధ్యాయుల భర్తీ చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ లో మండల పరిషత్ పాఠశాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మనఊరు– మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను మంత్రి ప్రారంభించారు. సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు కల్పించామని హరీశ్రావు స్పష్టం చేశారు.
పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాఠశాల విద్యా కమిషనర్, మేయర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఆధునిక వసతులు కల్పించాక 700 ప్రభుత్వ పాఠశాలలను ఒకే రోజు ఒకే సారి ప్రారంభించడం సగర్వంగా, సంతోషంగా ఉందన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడానికి నడుం బిగించడం ఆనందంగా ఉందన్నారు.
ఓ వైపు నాణ్యమైన విద్యను అందిస్తూనే, మరో వైపు అన్ని వసతులతో కల్పిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామన్నారు. డిజిటల్ క్లాసులు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పాఠశాల విద్యార్థులకు శానిటేషన్ కిట్లు ఇవ్వనున్నామని తెలిపారు. మరో 10 రోజుల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 9 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రమోషన్లు పూర్తైతే ఉపాధ్యాయుల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు….ఉపాధ్యాయులు నేటి పరిస్థితులు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారని హరీశ్రావు ఆదేశించారు.
సర్కారు బడుల్లో విద్య అభ్యసించిన విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సాధించాలని సూచించారు. గొప్ప స్థాయికి ఎదగాలని మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు.