TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని అన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని వ్యాఖ్యానించారు.
భారాస పార్టీ ప్రజల పార్టీ….కాబట్టి మాకు ఎవరితోనూ సంబంధం లేదని అన్నారు. సెక్రటేరియట్ ను చూసి ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అంబర్పేట, సికింద్రాబాద్లో అభివృద్ధి ఎక్కడుందో, ఎలా జరిగిందో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూటకో మాట, గంటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలకడ లేని మనిషని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులు, భారాసను వదిలి వెళ్లిన వాళ్లు ఎంత ఆపసోపాలు పడుతున్నారో గమనిస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు ఊరుకోరని….గట్టిగా సమాధానం చెబుతారని దుయ్యబట్టారు.
అంబర్పేట అభివృద్ధిపై చర్చకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ భారాసలోకి వస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలన్నారు. తెలంగాణలో స్వతహాగా భారాస ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని మంత్రి తలసాని అన్నారు.
అటు కేంద్ర ప్రభుత్వం అన్నింటిలోనూ మాకు అడ్డుపుల్లలు వేస్తూనే ఉందని విమర్శించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి అనుమతిచ్చిన కేంద్రం…. మా సెక్రటేరియట్ ప్రారంభానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
కేంద్రంలో ఉన్న భాజపా దేశాన్ని ఎలా నడిపిస్తోందో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్ ను చూసి ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై వాళ్ల పార్టీ నేతలే మండిపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ లో ఎంపీగా ఉంటే…. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భాజపాకు ఓట్లు వేయమని చెప్పడం….ఎంతటి గొప్ప వ్యక్తో తెలుస్తుందని అన్నారు.