MAHABUBNAGAR: మహబూబ్నగర్లోని దివిటిపల్లి వద్ద ఐటీ కం మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్లో విద్యార్థులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. దివిటిపల్లిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రి వర్గం పనిచేస్తోందని మంత్రి అన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కొందరు ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడ్డ పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి అన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఏర్పడ్డాక…..రాష్ట్రం రూపురేఖలు, తీరుతెన్నులు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారని మంత్రి కొనియాడారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వలస బాట పట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పక్కన పెట్టి యుద్ధంచేశారని మంత్రి ప్రస్తావించారు. 20 చిన్న పాటి సాఫ్ట్వేర్ సంస్థలను తీసుకువచ్చామని తెలిపారు.
అమర్ రాజా కంపెనీని కూడా తెలంగాణ తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ కంపెనీ వల్ల రాష్ట్రంలో కాలుష్యం ఏర్పడుతుందని…..కొందరు రాజకీయ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చమురు అడుగంటిన సమయంలో అమర్ రాజా కంపెనీ రాష్ట్రానికి రావడం ఎంతో అవసరమని మంత్రి గుర్తు చేశారు. త్వరలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని మంత్రి చెప్పారు. అందుకే NRI లతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించేవారికి ప్రజలెవరూ భయపడవద్దని మంత్రి సూచించారు. ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని కాపాడుతుంటే……దాని నుంచి ఫలితం వచ్చే సమయంలో అడ్డుకుంటే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.