హైదరాబాద్: రాష్ట్రంలో 80వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారని.. దీన్నినిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఏడేన్నరేండ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసిందని.. అలాంటి వారు ఆనందపడే రోజు ఇది అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటన వారికి గోల్డెన్ ఆపర్చ్యునిటీ అన్నారు. నిజాం కాలేజ్లో నిర్వహించిన గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమానికి కేటీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు.
ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి..
విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని కేటీఆర్ సూచించారు. ఎంతో మంది ఇండియన్స్ ప్రపంచస్థాయి కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని.. మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విటర్, ఐబీఎం మొదలైన ప్రఖ్యాత సంస్థల సీఈవోలు, ఛైర్మన్లు భారతీయ సంతతికి చెందిన వారేనని చెప్పారు. మన దేశంలోనే పుట్టి ఇక్కడే చదువుకుని విదేశాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారన్నారు. మన ఎబిలిటీ, పొటెన్షియాలిటీని ప్రపంచం గుర్తిస్తోందని చెప్పారు. మన దేశంలోని కంపెనీలు కూడా వరల్డ్వైడ్ ఎదగాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ సెక్టార్లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు.