తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో ప్రగతి భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ …పద్యసాహిత్యం, గద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాలు తదితర అంశాల్లో ఉద్దండులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారన్నారు. తెలుగు భాష వైభవానికి కృషి చేసిన వారందరినీ స్మరించుకోవాలని సీఎం వెల్లడించారు. తెలుగు భాష కోసం వాళ్లు చేసిన కృషిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయని… దేశంలోని చాలా రాష్ర్టాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు, సంఘాలున్నాయన్నారు. దేశ, విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతో పాటు, చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగు వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలన్నారు.అమెరికా సహా తెలుగు వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఏపీ సహా తెలుగు వారున్న రాష్ర్టాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలన్నారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడేం జరుగుతుందో అందరికీ తెలియడానికి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులను ఆన్ డ్యూటీ మీద సభలకు ఆహ్వానించి.. బాధ్యతలు అప్పగించాలన్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారన్నారు. మహాసభల్లో పాల్గొనే వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.