ప్రజసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కార్యకర్తలు , అభిమానులు ఘనస్వాగతం పలికారు.పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వైఎస్ జగన్కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ..
వ్యవస్థలో విశ్వసనీయత రావాలన్నా, రాజకీయాలు మారాలన్నా.. అబద్ధాలు చెప్తూ , మోసాలు చేసే చంద్రబాబు పాలన పోవాలని అన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తుల్ని క్షమిస్తే.. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు ఆయన ఈసారి కొత్త ఎత్తులు వేస్తారని, ప్రతి ఇంటికీ కిలోబంగారం ఇస్తానని, ప్రతి ఇంటికీ ఒక మారుతికారు కొని ఇస్తానని చంద్రబాబు చెప్తారని, ఇలాంటి వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని వైఎస్ జగన్ ప్రజలకు సూచించారు.
తనను ప్రజలు నమ్మరేమోనని చంద్రబాబు ఈసారి ఎవరో ఒకర్ని తన పక్కనపెట్టుకుంటారు. ఒక సినిమా యాక్టర్నో మరొకరినో తెచ్చుకుంటారు. ఆ యాక్టర్ చంద్రబాబు గురించి చెబుతారు.. నాదీ పూచీ చంద్రబాబుకు ఓటేయండి అంటారు. అలాంటి పరిస్థితి మారాలి. విశ్వసనీయతకు పట్టం కట్టాలి’ అని వైఎస్ జగన్ ప్రజలను అప్రమత్తం చేశారు.ఎన్నికల సందర్భంగా నాయకుడు ప్రజలకు చెప్పిన ప్రతిదీ చేయాలి, లేకుంటే ఆ నాయకుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. రాజకీయాలలో మార్పు రావాలి, విశ్వసనీయతకు అర్థం రావాలి. జగన్కు మీరంతా తోడుగా, అండగా ఉన్నప్పుడే ఈ వ్యవస్థ మారుతుంద’ని అన్నారు