సబ్బండ వర్గాలు సమిష్టిగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరినీ సీఎం కేసీఆర్ తన కన్నబిడ్డల వలే చూసుకుంటున్నరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ఎన్నెస్పీ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్బీ బేగ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించటం జరిగిందన్నారు.
త్వరలోనే మిషన్ భగీరథ పథకం అమల్లోకి వస్తుందని, అన్నివర్గాల వారికి, రాజకీయ పార్టీలకు చెందిన వారికి మంచి నీటిని అందివ్వబోతున్నమని చెప్పారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం పథకంలో కూడా అర్హులైన వారికే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అధికారులు, ప్రజల సమక్షంలోనే లాటరీ వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. తమ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రాజకీయాలకు తావుండకూడదన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 47 కార్పొరేషన్ పదవులు ప్రకటిస్తే, వాటిల్లో నూటికి తొంభైశాతం ఉద్యమకారులకే ప్రాధాన్యత కల్పించామన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంకోసం, పార్టీకోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ సముచితస్థానం కల్పిస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.
ప్రస్తుత 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగబోతుందని మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. రైతాంగానికి ఈ ఏడాది నుంచి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు సైతం ఈ సంవత్సరంలోనే ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. అభివృద్ధి, పార్టీ నాయకులు, కార్యకర్తల త్యాగాల పునాదుల మీద 2019లో జైత్రయాత్ర కొనసాగించి 100 సీట్లు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.