‘మా కెప్టెన్ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సెంచరీ కొట్టబోతోంది. ఉద్యమ సమయంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్తో నడిచి వెన్నంటే ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది.ఈ నాలుగేళ్లలో కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. అభివృద్ధి పురోగతిలో ఉంది.తెలంగాణ అనే కారు మంచి కండిషన్లో ఉంది.. దూసుకుపోతోంది. కారు డ్రైవర్ను ప్రజలు మార్చరన్న విశ్వాసం నాకు ఉంది’’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.గడిచిన 3 ఏళ్లలో దాదాపు 15 సర్వేలు చేశారు. అన్ని సర్వేల్లో కూడా కచ్చితంగా గెలుస్తాం అనే వచ్చింది.
ఎక్కడైనా స్థానిక నాయకుడిపై వ్యతిరేకతతో టీఆర్ఎస్కు ఓటేయకపోతే రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడుతదనే ఆలోచన ప్రజల్లో ఉందని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తంచేశారు. అభ్యర్థిపై స్వల్ప వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పారు. కేసీఆర్ శాసనసభను రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై శుక్రవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఎన్నో కష్టాలు,కన్నీళ్లు, పోరాటాలు, ప్రాణ త్యాగాల తర్వాత సిద్ధించిన ఈ రాష్ట్రంలో రాజకీయాలకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా కనీసం తొలి ఐదేళ్లు ప్రజల కోణంలో అభివృద్ధి జరగాలని రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించారు.మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణం అన్ని పథకాల విషయంలో ఉదారంగా వ్యవహరించాం. . కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పాలమూరు, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను శరవేగంగా కట్టేందుకు సీఎం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ వారు చనిపోయిన వ్యక్తుల దొంగ వేలిముద్రలతో 186 కేసులు వేశారు. ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసి మంచి పేరు తెచ్చుకోకూడదు అనే ఒక కక్ష పూరితమైన వ్యవహారమిది అని చెప్పారు.