టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో దఫా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలు, ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుని నామినేట్, పార్లమెంటరీ కార్యదర్శుల నియమక ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా స్టిఫెన్సన్ను నియమించాలని నిర్ణయించారు. స్టిఫెన్సన్ను నియమిస్తూ మంత్రివర్గం గవర్నర్ నరసింహన్కు ప్రతిపాదన పంపింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్కు, ప్రభుత్వ యంత్రంగానికి మంత్రి వర్గం అభినందనలు తెలిపింది. ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని నిర్ణయించారు. సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులు, నిబంధన పుస్తకాలు, బుక్లెట్లు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సభ్యులకు అందించే ప్రతులను సీఎం కేసీఆర్కు అసెంబ్లీ కార్యదర్శి చూపించారు.